అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ట్విటర్ వేదిక ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు నరకం అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలింతలు, రోగులు పడుతున్న ఇబ్బందులకు సీఎం ఏం సమాదానం చెప్తారని పేర్కొన్నారు.
రాష్ట్రం చీకట్లోకు కారణం ఎవరని ప్రశ్నించారు. పెరిగిన విద్యుత్ బిల్లులను అష్టకష్టాలు పడి ప్రజలు కడుతున్నా ఇంకా విద్యుత్ కోతలెందుకని నిలదీశారు. విద్యుత్ లేక గ్రామగ్రామాన ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్లకు సన్మానం పేరిట రూ. 233 కోట్లు ఖర్చుచేశారని విమర్శించారు. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తే బెదిరించడం మాని సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.