న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ జిల్లాకు తరలించే ప్రతిపాదన ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో శుక్రవారం వెల్లడించారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలించే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ అడిగిన ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు.
హైకోర్టు తరలింపు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఈ విషయంలో హైకోర్టుతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలనా ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పారు. హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు.