Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్కుమార్రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆ ఇద్దరికి సహకరించిన ఇతర ఉద్యోగులను సైతం విచారించాలని ఆదేశాల్లో పేర్కొంది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు, విజయ్కుమార్రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ఫిర్యాదులు చేశాయి.
ధర్మారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ చేయగా.. విజయ్కుమార్రెడ్డి ఇటీవల కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చారు. టీటీడీని అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్తో సంబంధం లేకుండా కాంట్రాక్టులు ఇచ్చారని ధర్మారెడ్డిపై ఆరోపణలున్నాయి. శ్రీవాణి టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. సమాచార శాఖలో అవినీతికి పాల్పడ్డారని విజయ్కుమార్పై ఆరోపణలు ఉండగా.. ప్రకటనల పేరుతో రూ.కోట్ల మేర విజయ్ కుమార్ అవినీతికి పాల్పడ్డట్లుగా విమర్శలున్నాయి.