హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిజం ఒప్పుకొన్నది. ప్రాజెక్టు పనులు ఎప్పటినుంచో సాగుతున్నాయని.. పరిశీలనకు నిజనిర్ధారణ కమిటీ అక్కర్లేదని స్వయంగా పేర్కొన్నది. సీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టడం లేదని, కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్ పనులు, జియాలజికల్ సర్వే, డీపీఆర్ల కోసమే తవ్వకాలు చేపడుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా ముందస్తుగానే అప్రోచ్ కెనాల్ తవ్వినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఆదివారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నీటి వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-1,2లు కేటాయించిన తమవాటా నీటిని తరలించటానికి ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సరిపోవటంలేదని, అందుకే సీమ లిఫ్ట్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకుపైగా నీరు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించటానికి అవకాశం ఉన్నదని, అందువల్లనే 800 అడుగుల స్థాయినుంచి కూడా నీటి ని తరలించేందుకు సీమలిఫ్ట్ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించేలా దీనిని నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, చెన్నైకి తాగునీటికోసం 15 టీఎంసీలు, తెలుగుగంగ ప్రాజెక్టుకు 29 టీఎంసీలు, గాలేరు సృజలశ్రవంతికి 38 టీఎంసీలు కలిపి మొత్తం 101 టీసీంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకొనే హక్కు తమకు ఉన్నదని చెప్పారు. సీమ లిఫ్ట్లో భాగంగా శ్రీశైలం నుంచి 8.89 కిలోమీటర్లమేర కాలువ తవ్వాల్సి ఉండగా.. అక్కడ సున్నపురాయి భూమి ఉండటం, వర్షాలు పడి తే పనులుచేయడం వీలుకాదనే ఉద్దేశంతో ఎండాకాలంలోనే కాలువ తవ్వకం పనులు పూర్తిచేశామని చెప్పారు. ఎలాంటి కాంక్రీట్, ఇతర పనులు చేపట్టలేదని వివరించారు.