Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొన్న ఇద్దరు విదేశాలకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకొన్నారన్న ఆరోపణలతో ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.
కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చే సమయంలో వారు విదేశాలకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నెల 5న వాసుదేవ్ దుబాయ్కి, 6న శ్రీనివాసరావు అమెరికాకు వెళ్లినట్టు నిర్ధారించారు. టీడీపీ హ యాంలో 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ నుంచి రూ.118 కోట్లు ముడుపులుగా చేతులు మారినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.