Chandrababu naidu | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు అరెస్టు భయం పట్టుకున్నది. రూ.118 కోట్ల అక్రమ సంపాదన విషయమై ఆదాయ పన్నుశాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఒకటి రెండు రోజులలో తాను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎలాంటి దాడులకు పాల్పడినా తానే ధర్మంగా గెలుస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
గతంలో వైఎస్ఆర్ కూడా తన 26 ఎంక్వైరీలు వేశారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి భూములు, ఔటర్ రింగ్ రోడ్డు అవినీతి అంటున్నదని వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మంత్రులు స్పందిస్తూ.. రూ.118 కోట్ల ముడుపుల తీసుకున్నారని గుర్తించిన ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఏ క్షణంలోనైనా సీబీఐ, ఈడీ విచారణ జరిగి జైలుకు వెళ్లడం ఖాయమని తేలడంతోనే ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.