విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్లతో మొత్తం 135 నామినేటెడ్ పోస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ మేరకు నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం 135 పోస్టుల్లో 76 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. మిగిలిన 59 పోస్టులను ఇతర కులాల వారితో భర్తీ చేశారు. 68 పోస్టులను మహిళలకు కేటాయించి నామినేటెడ్ పోస్టుల్లో వారికి పెద్దపీట వేశారు. పోస్టుల దక్కించుకున్న వారికి వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టులు కేవలం పేరు కోసం కాదని, పదవులు వచ్చిన వారు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి సామాజిక, రాజకీయంగా సీఎం జగన్ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. పదవులు దక్కని పార్టీ నాయకులు నిరాశ చెందొద్దని భవిష్యత్లో అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగానే పరిగణించాయే తప్పా వారి రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ఏం చేయలేదని ఎంపీ మోపిదేవి వెంకట రమణ అన్నారు.