అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ఆర్టీఏ అధికారుల అత్యుత్సాహంపై ప్రభుత్వం సీరియస్గా స్పందిం చింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధ్య, హోంగార్డు తిరుపతి రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సీఎం ఒంగోలులో పర్యటన సందర్భంగా నిన్న రాత్రి ప్రకాశం జిల్లా వినుకొండ నుంచి వేమల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి అద్దె కారులో వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి బెదిరించాడు. ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. కారును స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మహిళలు, పిల్లలను రోడ్డుపైనే ఉంచి డ్రైవర్తో సహ కారును తీసుకెళ్లారు. దీంతో ఆ కుటుంబం రాత్రి బస్టాండ్లోనే ఉండి మరో అద్దె కారులో తిరుమలకు చేరుకున్నారు.
ఈ విషయం ప్రసారమాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో సీఎం జగన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎంవోకు ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఆర్టీఏ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, హోంగార్డును సస్పెన్షన్ చేశారు.