అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మరికొద్దిరోజుల్లో ముగుస్తుంది. సోమవారం 43వ రోజు రేణిగుంట నుంచి ప్రారంభించిన పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగనుంది. ఈనెల 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు.
అనుమతి కోసం జిల్లా ఎస్పీకి అమరావతి పరిరక్షణ సమితి నాయకులు వినతిపత్రం అందజేయగా పోలీసులు నిరాకరించారు. దీంతో జేఏసీ నాయకులు బహిరంగ సభ అనుమతి కోసం సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సభను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని రైతుల తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ పిటిషన్లో పేర్కొన్నారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతి ఇవ్వకుండా.. పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారని ఆయన తెలిపారు.