హైదరాబాద్ : చంద్రబాబు కన్నీళ్ల గురించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబును ఏడ్పించడం ఆ దేవుడి వల్ల కూడ కాదన్నారు. అంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే చంద్రబాబు ఇవాళ తన పాత్ర పోషించారని ఎద్దేవ చేశారు. ప్రజల సింపతి కొట్టేయడానికి చంద్రబాబుకు ఇంతకన్నా వేరే దారి లేదని విమర్శించారు. రోజు రోజుకూ టీడీపీ పార్టీ కనుమరుగవుతుండటాన్ని చూసి తట్టుకోలేక మరో డ్రామాకు చంద్రబాబు తెరలేపారని అంబటి అన్నారు.
చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించి ఉంటే అసెంబ్లీలో రికార్డులు ఉన్నాయి చూసుకోవచ్చని అన్నారు. సభలో వ్యవసాయ మంత్రి మాట్లాడుతుంటే టీడీపీ నేతలే ముందుగా రెచ్చగొట్టే రన్నింగ్ కామెంట్స్ చేశారని, అయినా తాము సంయమనం పాటించామని చెప్పారు. తెలుగు దేశం పార్టీ పతనాన్ని జీర్ణించుకోలేక అసహనంతో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు.