Ambati Rambabu : రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని లేకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో కేవలం అవినీతి, కమీషన్ల కోసమే అమరావతిని వాడుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కేంద్రం నిధులిచ్చినా శాశ్వత భవనాలు కట్టకుండా, తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు.
అమరావతి అనేది ఎప్పటికీ పూర్తికాని ఒక అంతులేని కథ అని రాంబాబు అన్నారు. ఈ జన్మలోనే కాదు, మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ‘మూడు రాజధానుల’ ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని చూస్తే.. చంద్రబాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అమరావతి అంశాన్ని నాన్చుతున్నారని దుయ్యబట్టారు.