అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగినకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొన్నదని, మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాజదాని ఏదో కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు.
దీనిపై మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. ‘మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మూడు రాజధానులని.. పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే’ అని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.