అమరావతి : కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఇటీవల జరిగిన ఘటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఏలూరు డీఐజీ పాలరాజ్ వెల్లడించారు. ఘటనపై ముందస్తుగానే వాట్సాప్లో చర్చించుకున్నారని ఆయన వివరించారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమేం చేయాలో చర్చించుకున్నారని ఆయన తెలిపారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను కూడా అరెస్ట్ చేస్తున్నామని ,ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. సాయంత్రానికి మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన అన్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్కు వ్యతిరేకంగా అమలాపురంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వైసీపీ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే ఇంటికి నిప్పంటించి నిరసన తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా భావిస్తున్న పోలీసులు విధ్వంసానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. సమీప సీసీ టీవీ ఫుటేజీ, మీడియా చిత్రీకరించిన దృశ్యాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.