Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలి నడకన భక్తులు, యాత్రికులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాలి నడకన చేరుకుంటుండటంతో శ్రీశైల మహాక్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 19 నుంచి 23 వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఉత్సవ రోజుల్లో లింగ దర్శనం ఉండదని, కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈఓ లవన్న స్పష్టం చేశారు. దేవస్థానం అనుమతులతో పలు స్వచ్ఛంద సేవా సంఘాల ఆధ్వర్యంలో కాలినడక భక్తులకు మార్గమధ్యంలో అన్న దానాలు చేస్తున్నారు. కాలినడక భక్తులకు ప్రత్యేక కంకణాలను ఏర్పాటు చేసి శ్రీఘ్రదర్శనం ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు.
ప్రస్తుతం స్వామి అమ్మ వార్ల గర్బాలయ స్పర్శ దర్శనాలు జరుగుతున్నందున ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు నాలుగు నుండి ఆరు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా రెవన్యూ, దేవస్థాన అధికారులు అప్రమత్తమవుతున్నారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సుదూర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేసిన చలువ పందిళ్లు, క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాలు, అన్నదాన వితరణ వసతులు కల్పించారు.. వాటిని కాలి నడకన వచ్చే భక్తులు, యాత్రికులు పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలని ఈవో లవన్న కోరారు. అదే విధంగా కైలాసద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి ఆలయాలతోపాటు వివిధ ప్రాంతాలలో స్వచ్ఛందద సంస్థలు, శివసేవకులతో కూడా సహకరించాలని అన్నారు.
శ్రీశైల క్షేత్రంలో జరుగనున్న ఉగాది మహోత్సవాలకు వేల సంఖ్యలో వస్తున్న యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరిగివెళ్లాలని ఈవో లవన్న కోరారు. అదే విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు, వృద్దులు చంటిపిల్లలతో ఉత్సవాలు ముగిశాక స్వామి అమ్మవార్ల దర్శనాలకు రావాలని సూచించారు. క్షేత్రానికి వచ్చి దర్శనానంతరం భక్తులు రాత్రి వేళ నిలిచిపోవడంతో తోటి యాత్రికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు అంటున్నారు.