విజయవాడ: అక్టోబర్ 31 వ తేదీ నుంచి విజయవాడ-షార్జా మధ్య విమానాలు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించినప్పటికీ టికెట్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టారు. దీంతో దాదాపు మూడున్నరేండ్ల అనంతరం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వందే భారత్ మిషన్లో భాగంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభమయ్యాయి.
విజయవాడ-షార్జా మధ్య ఎక్స్ప్రెస్ విమాన సేవలు ప్రతి సోమవారం, శనివారం ఉంటాయి. 186 మంది ప్రయాణీకుల బోయింగ్ 737-800 విమానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.40 గంటలకు షార్జా నుంచి బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇక్కడ సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుతుంది. విజయవాడ నుంచి షార్జాకు ప్రారంభ టిక్కెట్ ధర రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీసు ప్రారంభమైతే అరబ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇటీవల విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంతో ఇక్కడి నుంచి విదేశాలకు పూర్తి స్థాయిలో సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మాన్, పుజిరా, రస్ అల్ ఖైమా నుంచి ఇక్కడికి ప్రయాణించడం సులభతరం అవనున్నది. అలాగే, గల్ఫ్లోని అనేక దేశాలకు వెళ్లడానికి షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. భవిష్యత్లో ప్రయాణీకుల డిమాండ్కు తగినట్లుగా దుబాయ్, కువైట్ నుంచి పూర్తి స్థాయి విమాన సర్వీసులను నడపడానికి వివిధ విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. విజయవాడ విమానాశ్రయానికి 2017 మే నెలలో అంతర్జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, పలు సాంకేతిక కారణాలతో 2019 లో విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి ఒక సర్వీసు నడిచే సర్వీసును 6 నెలలపాటు రద్దు చేశారు. ప్రస్తుతం మస్కట్కు వారానికి ఒక సర్వీసు, అలాగే షార్జా, కువైట్, మస్కట్ నుంచి వారానికి ఐదు సర్వీసులు మాత్రమే ఇక్కడి నుంచి నడుస్తున్నాయి.