తాడేపల్లి: ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదే అని వెల్లడించారు. సీఆర్డీఏ చట్టాలన్ని అమలు చేస్తున్నామని, హైకోర్టు కూడా ఇవాళ అదే చెప్పిందన్నారు. ఈ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదని తెలిపారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నామని మంత్రి బొత్స చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లేదే లేనిదీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం చట్టాలను రూపొందించే హక్కు అసెంబ్లీకి ఉంది. అలాగే భూములు ఇవ్వడానికి గడువు విధించడంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం, ఇక ముందు కూడా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సమాజం కోసం కాకుండా తన సామాజికవర్గం కోసం పనిచేశాడని వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం త్వరలో మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నదని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పాలనను వికేంద్రీకరించడానికి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తమ విధానమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెండు, మూడు రాజధానుల ఏర్పాటుకు లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకని ఆయన ప్రశ్నించారు.