Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరానంటుతున్నాయి. మూడవరోజు మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మ వారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారని ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా ప్రభోత్సవం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో ప్రభను శోభాయమానంగా అలంకరించారు.
ఆలయ ప్రాంగణం నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో మంగళవాయిద్యాలతో గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రభపై అధిష్టింపజేశాక అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో ఉన్న కన్నడ భక్తులు ప్రభను తిలకించేందుకు పురువీధుల్లోకి తరలివచ్చారు.
కన్నడ భక్తజనం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కీర్తిస్తూ ప్రభోత్సవంలో పాల్గొన్నారు. చైత్ర శుద్ద పాడ్యమి నాడు స్వామిఅమ్మవార్లు రథోత్సవంలో క్షేత్ర పురువీధుల్లో విహరించేందుకు ముందుగా చండీశ్వరుడు వచ్చి క్షేత్ర పర్యటన చేసి వెళ్లే ఆనవాయితీగా ప్రభోత్సవం నిర్వహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను నంది వాహనంపై ఆసీనులను గావించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడషోపచార ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశైల శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించారు. చతుర్బుజాలు కలిగిన ఈదేవి వీణ, అక్షమాల, పుస్తకం ధరించి భక్త శ్రేణులకు దర్శనం ఇచ్చారు. ఈ అమ్మవారిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుండి బయలు వీరభధ్రస్వామి వరకు కన్నుల పండవగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందులు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపద డోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో లవన్నతో పాటు పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, ఏఈవో హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.