తిరుపతి : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాల(Milk)ను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్(Ttd Chairman) వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్( Feed mixing plant), టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిందన్నారు. ఇందుకోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేస్తున్నామని వివరించారు.
లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభవ సంబంధం ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్ బయోసైన్సెస్ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. ఇందులో భాగంగా రూ.11 కోట్లతో టీటీడీ సొంతంగా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించుకోగా దాత ఒకరు రూ. 2కోట్లు విరాళం అందించారని తెలిపారు.
దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడానికి దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకువచ్చామని తెలిపారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభరెడ్డి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు.