అమరావతి : ఏపీలో హింసాకాండకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) అన్నారు. రాజకీయ లబ్ది కోసం హింసను ప్రేరేపించవద్దని , ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాలో అధికారులను బదిలీ (Tranfers) స్థానంలో వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల వారు భద్రత చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. అధికారుల మార్పిడి జరిగిన ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలపై వైసీపీ (YCP) ని నిందించడం సరికాదని తెలిపారు.
ఈసారి వైసీపీ 175 స్థానాలకు సమీపంలో సీట్లను గెలువబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు. రానున్న ఫలితాలను ముందుగానే గ్రహించిన టీడీపీ(TDP) నాయకులు ఢీలా పడి మహానాడును వాయిదా వేసుకున్నారని ఆరోపించారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఘటనను కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మోహన్రెడ్డి పాలనను ప్రారంభిస్తున్న దశలో విశాఖ ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోరారు . ప్రజా తీర్పు ఆధారంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని కోర్టును కూడా కోరుతామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.