తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిరాధారమైన నిందారోపణలు చేసిన ఆ ఛానల్ చర్యలను తప్పుపట్టింది. లాక్డౌన్ సమయంలో 21 రోజులు శ్రీవారికి నైవేద్యం సమర్పించలేదని ఆరోపించడం అవాస్తమని తెలిపారు. ఆ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు నిలిపివేశారే తప్పా స్వామి వారికి జరిగే పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయని వెల్లడించింది.
సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమాలు చేపట్టామని తెలియజేసింది. ఇందులో భాగంగా 2021 అక్టోబరు 7 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులను ఉచితంగా తిరుమలకు తీసుకుని వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించామని స్పష్టం చేసింది, ఇదే తరహాలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని వివరించారు.
టీటీడీ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ఫాస్టర్లను పోషిస్తోందని, జెరూసలెం యాత్ర, హజ్ యాత్రకు నిధులు అందిస్తోందని చేసిన ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని తెలిపింది. భక్తులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.