తిరుమల : తిరుమల (Tirumala) లో దుకాణాల యజమానులు పాదచారుల రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు (TTD EO Shyamala Rao) అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి ఈవో వరాహస్వామి విశ్రాంతి భవనం, ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్ (Shoping Complex) లలోని దుకాణాలను తనిఖీ చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్ వరండాలో సరకులను నిల్వ ఉంచి, భక్తుల రాక పోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులను, షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికారిక తట్టలు, హాకర్లకు నోటీసులు అందజేయాలని సూచించారు. ఇందులో భాగంగా షాపుల లైసెన్స్లు, సంబంధిత ధృవీకరణ పత్రాలను ఆయన పరిశీలించారు.
తిరుమలలో పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో అనధికారిక తట్టలు, హాకర్ల లైసెన్సులను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు గోకులంలోని సమావేశ మందిరంలో జేఈవో వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలపై ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.