అమరావతి : ఏపీలో పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni) మరోసారి స్పందించారు. తనకున్న విచక్షణాధికారం మేరకు వేటు నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. వైసీపీ(YCP) ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదని పేర్కొన్నారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదని అన్నారు.
వైసీపీ, టీడీపీకిచెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వారికి సమయం ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని వెల్లడించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా కూడా తాను తీసుకున్న నిర్ణయం ఫైనలని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి(Sridhar Reddy) (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) టీడీపీలో చేరారు.
టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి కరణం బలరాం (చీరాల), గణేష్కుమార్ (విశాఖ దక్షిణ), వల్లభనేని వంశి (Vallabhaneni Vamsi) (గన్నవరం), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్) వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీకి చెందిన నాయకులు వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సోమవారం రాత్రి స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.