అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చాడు. తనకు దాహమేస్తుందని మంచినీళ్లు కావాలని అక్కడ ఉన్న మహిళను కోరాడు. ఆమె ఇంటిలోకి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి అతడికి ఇస్తుండగానే దుండగుడు తన వెంట తీసుకొచ్చిన యాసిడ్ ఆమె ఒంటిపై పోసి పారిపోయాడు.
ఈ దాడిలో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాధితురాలి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు దుండగుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.