అమరావతి : వైసీపీ మంత్రులు నోరులేని మూగ జీవులని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు రెడ్లు రాజ్యాధికారం చెలాయిస్తున్నారని, బీసీ మంత్రులకు అధికారాలు, సామాజిక న్యాయం ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మూడేండ్ల వైసీపీ సంబురాలపై మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే జగన్ విధ్వంసాలతో మొదలు పెట్టారని వెల్లడించారు.
నీటి పారుదల వ్యవస్థను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని విమర్శించారు. మోసపూరిత సంక్షేమం పేరిట ప్రజలను మోసం చేశారని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందని విరుచుకుపడ్డారు. వైజాగ్ నగరాన్ని ఐటీ నగరంగా తీర్చిదిద్దేందుకు లోకేశ్ ప్రయత్నించగా మూడేండ్లు వైసీపీ పాలనలో ఏ ఒక్కటి ప్రాజెక్టు విశాఖకు రప్పించలేదని ఆరోపించారు. స్వయాన పెట్రోలు, డీజిల్ ధరల సెస్సు తగ్గించాలని ప్రధాని కోరితే వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భూముల రిజిస్ట్రర్ ధరలను పెంచారని, చివరకు చెత్త పన్ను కూడా వేసి ప్రజలపై భారం వేశారని తెలిపారు. సొంత వ్యక్తులకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన యాత్రలపై ప్రజలు చీదరించుకున్నారని పేర్కొన్నారు.