అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జలాశయాల్లో సంవృద్ధిగా ఆశించిన దాని కంటే ఎక్కువగా నీరు ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.ఖరీఫ్ పంటలకు నీరు అందించేం దుకు గాను ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు రెండువేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాల్వలకు 500 క్యూసెక్కుల నీటిని మరో మంత్రి జోగి రమేశ్తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రుతు పవనాల ప్రభావంతో ఈ యేడాది మంచి వర్షాలు పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాకు ముందస్తుగా నీటిని విడుదల చేసే అవకాశం దక్కిందని అన్నారు. దీని వల్ల మొదటి పంటకు సకాలంలో నీరు అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పులిచింతల, శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణానదిపై ఉన్న జలశాయాలు నిండుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.