విశాఖపట్టణం : తన ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో ఓ యువతిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖలోని ఓ హోటల్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ రెడ్డి(21), విశాఖకు చెందిన ఓ యువతి(20) పంజాబ్లో గతేడాది బీటెక్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్ పూర్తి కావడంతో హర్షవర్ధన్ రెడ్డి హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే శుక్రవారం హర్షవర్ధన్ రెడ్డి విశాఖలోని ఓ హోటల్లో దిగి, సదరు యువతికి తాను వచ్చిన సమాచారాన్ని అందించాడు. ఆమె కూడా ఆ హోటల్కు శనివారం వచ్చింది. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతిని హర్షవర్ధన్ రెడ్డి కోరాడు. ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
హోటల్ గదిలో నుంచి మంటలు, పొగలు వెలువడంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు 62 శాతం, యువతి 61 శాతం కాలిన గాయాలయ్యాయి. వీరిద్దరూ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.