అమరావతి : ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన ఆ యువకుడు మృత్యువాత పడడం అతడి కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే ప్రమాదవాశాత్తు మరణించిన ఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్(35) అనే యువకుడు నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈనెల 17న అమెరికాకు వెళ్లాడు. మూడురోజుల కిందట అతడు సీమన్గా ఉద్యోగంలో చేరాడు. విధులు నిర్వహిస్తుండగా రవికుమర్ కంటెయినర్పై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ విషయం కంపెనీ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన కుటుంబ సభ్యుడు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయపడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.