అమరావతి : కూలి పనుల కోసం వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటనలో ఒక డ్రైవర్ మృతి చెందగా మరికొందరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ సమీపంలో కూలీలు అరటి గేలలు కోతకు వెళ్లారు. అరటి గేలలను కోస్తుండగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో లారీ డ్రైవర్ షేక్వలి మృతి చెందాడు. పలువురికి గాయాలు కాగా మరికొందరూ అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.
కాగా గత రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా ఆమె దహన సంస్కారాల కోసం వెళ్లిన బృందంపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు(62) అనే వృద్ధుడు ఆయాసం,గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలయ్యాయి.