గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గణతంత్ర దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ తదితర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో విజయవాడలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు జిగేల్ మంటున్నాయి. రాత్రి వేళ మరింత శోభను సంతరించుకుని పండగ వాతావరణాన్ని మోసుకురావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఏపీ సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖ, గుంటూరు, కడప, తిరుపతి పట్టణాలను కూడా అందంగా అలంకరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రేపు రిపబ్లిక్ వేడుకలు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.