తిరుపతి : తిరుపతిలోని కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 8న మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం(Rudrabhishekam) , ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రథోత్సవం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టనున్నామని ఆలయ అర్చకులు వివరించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నంది వాహనసేవకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని అన్నారు.
మార్చి 9న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం నిర్వహించనున్నామని తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని జరుగుతుందన్నారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని వివరించారు.