అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల ముందుగానే సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీ ఆర్టీసీ (AP RTC ) రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్(Hyderabad), చెన్నై,బెంగళూరు తదితర నగరాల నుంచి శనివారం నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. ఈ నెల 18 వరకు ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ఏపీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
సంక్రాంతికి ముందు ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య రెగ్యులర్ సర్వీసుల్లో ముందుస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని, ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్లోని పలు పాయింట్లలో సూపర్వైజర్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల సమాచారంకోసం, ఏవైనా సమస్యలు ఉన్నా కాల్ సెంటర్ నంబరు 149కి గానీ, 0866-2570005 నంబరుకు గాని ఎప్పుడైనా ప్రయాణికులు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.