అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవ చేశారు. సకాలంలో స్పందించక పోవడంతోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని విమర్శించారు. వరదలతతో సుమారు రూ. 6వేల కోట్ల విలువైన పంట, ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.
ప్రభుత్వానికి ముందు చూపు, ప్రణాళిక లేకపోవడంతో ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాణ నష్టం అని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ బాధితుల కంటే బందోబస్తుకు వచ్చిన పోలీసులే ఎక్కువగా కనిపించారని ఆరోపించారు. బాధితులు ఎవరూ కూడా సీఎంను కలువకుండా అడ్డుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్లను నిధులను మళ్లించారని దుయ్యబట్టారు.