తిరుమల : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నామని వివరించారు. తిరుచనూర్ ఆలయంలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. భక్తులు, యాత్రికులతో ప్రవర్తనపై ఆలయ సిబ్బందికి తగు శిక్షణ అందజేస్తామని తెలిపారు.
తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించి భవనాల అద్దెను పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. అవాస్తవాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకు సులభంగా దర్శనం కలిగించేలా మరిన్నీ చర్యలు తీసుకోవాలని ఈవోకు భక్తులు సూచించారు.