అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. అనంతపురం జిల్లాలోని కదిరి పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ భవన శిథిలాలు పక్కనున్న మరో రెండు భవనాలపై పడ్డాయి.
దీంతో ఆ రెండు భవనాల్లో ఉన్న 15 మందిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఏడుగురు సురక్షితంగా బయటకు వచ్చారు. శిథిలాల్లో చిక్కుకున్న మిగతా వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.