తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు (TTD Officials) వివరించారు.
నిన్న 76,876 మంది భక్తులు దర్శించుకోగా 23,424 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.20 కోట్లు వచ్చిందన్నారు.
మకర వాహనంపై కపిలేశ్వరస్వామి దర్శనం
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం కపిలేశ్వరస్వామి సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జీవో కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.