అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎస్ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించారు. పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. చలో సీఎంవోకు అనుమతి లేదని, ఎట్టిపరిస్థితుల్లో రాజధానికి రావద్దని సూచించారు. ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
ఉద్యోగుల చలో తాడేపల్లి పిలుపు నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 650 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.