Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మూడు రైళ్లు ఢీకొనడం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 మందిని ఆస్పత్రులకు తరలించారు. అయితే వారిలో తమ వారు ఎక్కడ ఉన్నారో తెలియక చాలామంది ఆస్పత్రులు, మార్చురీల చుట్టూ తిరగడం ఇప్పడు అందర్నీ కలిచివేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన 141 మంది ఏమయ్యారనే విషయం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
ప్రమాదం జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏపీ నుంచి ఎంతమంది ప్రయాణించారనే వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. దీని ప్రకారం కోరమాండల్ ఎక్స్ప్రెస్లో 482 మంది, హౌరా ఎక్స్ప్రెస్లో 89 మంది రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించారు. అంటే ప్రమాదం జరిగిన రైళ్లలో మొత్తం 571 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. వీరిలో చాలామందిని క్షేమంగా గుర్తించారు. అయితే ఈ రెండు రైళ్లలో ప్రయాణించిన 141 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. వీరిలో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన వారిలో 76 మంది, హౌరా ఎక్స్ప్రెస్లో 28 మంది ఉన్నారు. ఈ 141 మంది ఆచూకీ తెలుసుకునేందుకు ఫోన్స్ చేస్తుంటే కలవడం లేదు. వీరిలో చాలామంది ఫోన్లు పనిచేయడం లేదు. కొంతమందివి స్విచ్ఛాఫ్లో ఉన్నాయి. మరికొందరివి రింగ్ అవుతున్నా ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ఇంకొందరివి అయితే బీప్ శబ్దం వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో వీళ్లంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.