అమరావతి : ఏపీలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 140 బస్తాల సిమెంట్ను అందించనున్నట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. ఏపీ సచివాలయంలో ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్టణంలో ఉన్న నిరుపేదలు లక్షమందికి ఇళ్లు కట్టించే ఫైల్పై తొలి సంతకం చేశారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వశక్తులు ఒడ్డి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ను ఇచ్చేవారని ఇకపై తాము 140 బస్తాల సిమెంట్ను అందించనున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పేరు తీసుకొచ్చేలా తమ శాఖ కృషి చేస్తుందని వివరించారు.