అమరావతి : ఏపీలో ప్రధాన జలాశయాలన్ని నీటితో కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,046,47 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,01,586 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. 835.60 అడుగుల నీటీ మట్టం ఉంది. నీటి నిల్ల సామర్థ్యం 55.8766 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 6,013 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2,47,733 క్యూసెక్కుల నీరు వస్తుండగా 31,784 క్యూసెక్కుల నీటిని 25 గేట్ల ద్వారా ఎగువకు వదులుతున్నారు. జలాశయానికి గురువారం నుంచి రోజుకు 12.50 టీఎంసీల నీరు చేరుతోంది. ఇదే ప్రవాహం 12-14 రోజులపాటు కొనసాగితే డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం (215 టీఎంసీలు) చేరుకునే అవకాశముంటుంది.
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 18.14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. స్పిల్వే ఎగువనకు 35.580, దిగువన 27.220 మీటర్ల నీటి మట్టం ఉంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 17.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 18.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అల్లూరి జిల్లాలో విలీన మండలాలు నీటిలో మగ్గుతున్నాయి.