తిరుపతి: తమకు కేటాయించిన 300 ఎకరాల ఇండ్ల స్థలాన్ని త్వరగా ఇప్పించాలని టీటీడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించినా భూమి అప్పగించలేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టరేట్కు తరలివెళ్లిన జేఏసీ నాయకులు ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వడమాలపేట మండలం అరణ్యం పదిరేడు గ్రామంలో 300 ఎకరాల భూమిని ప్రభుత్వం టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి నాలుగు నెలల క్రితం కేటాయించింది. మార్కెట్ విలువ ప్రకారం భూమి ధర చెల్లించినా సొసైటీకి భూమిని అప్పగించలేదని వారు తమ గోడు వెల్లబోసుకున్నారు.
టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 3,500 మంది ఉద్యోగులకు ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం హౌసింగ్ సొసైటీకి స్థలం అప్పగించాలని వారు కలెక్టర్ను కోరారు. టీటీడీ ఉద్యోగులు 30 ఏండ్లుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారని, మరింత జాప్యం చేయడం వల్ల తమకు చాలా నష్టం వాటిల్లుతుందని జేఏసీ నాయకులు జీ వెంకటేశం, ఎం నాగార్జున, గిరిజ తదితరులు కలెక్టర్కు వివరించారు. జేఏసీ నేతల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తిరుపతి నగరంలోని ఎస్వీ పూర్హోమ్, ఎస్వీ డైరీ ఫామ్, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్, వినాయక్ నగర్, బ్రాహ్మణపట్టు గ్రామంలోని పలు ప్రాంతాల్లో టీటీడీ తన భూములను 20 ఏండ్ల క్రితమే కేటాయించిందని, అయితే దానిని సామాజిక కార్యకర్త ఒకరు సవాలు చేయడంతోపాటు ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదని వినతిపత్రంలో పేర్కొన్నారు. దాంతో టీటీడీ తన ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం భూములను కేటాయించే ప్రతిపాదనను రద్దు చేసిందని వారు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సొసైటీకి కేటాయించిన భూమిని అప్పగిస్తే.. అక్కడ కాలనీని అభివృద్ది చేసుకుని జీవిస్తామని వారు కలెక్టర్కు విన్నవించారు.