విశాఖ: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ధవళేశ్వరానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ ధవలేశ్వరానికి చెందిన ఆరుగురు యువకులు ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు స్విఫ్ట్ డిజైర్ కారులో విశాఖ బయల్దేరారు. మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో హుకూంపేట సమీపంలో రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతులు ధవళేశ్వరానికి చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను వెంకటేష్, సురేష్, గణేష్గా గుర్తించారు.