అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. వాస్తవానికి ఈరోజు ఒకరోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా బీఏసీలో వచ్చిన సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26 వరకు కొనసాగనున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ చేత ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులు ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.అనంతరం సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగింది.