తక్కువ నీటితో.. తక్కువ పెట్టుబడితో.. తక్కువ సమయంలో.. ఎక్కువ లాభాన్ని అందించే పంటగా థాయ్ జామ ఆదరణ పొందుతున్నది. అయిదారేండ్ల కిందట మొదలైన ఈ పండ్ల తోటల సాగు రాష్ట్రమంతటా క్రమంగా విస్తరిస్తున్నది. ఏటా రెండుసార్లు.. ఎకరానికి 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తున్నది. దీంతోపాటు.. అనేక ఆరోగ్య అంశాలు ఇమిడి ఉన్న పండు కావడంతో మార్కెట్లోనూ మంచి డిమాండు పలకుతున్నది. దీంతో రైతాంగం ఈ పంట సాగు దిశగా మొగ్గు చూపుతున్నది. ఇప్పటికే సాగు చేస్తున్న వారికి వస్తున్న లాభాలను చూసి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. అయితే నిత్యం స్వయం పర్యవేక్షణ, సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపడితేనే లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయిదేండ్ల కిందట ఈ థాయ్ జామ తోటను పెట్టి ఏటా మంచి దిగుబడి సాధిస్తున్న నల్లగొండ జిల్లా రైతు అనుభవాలు సైతం ఇదే చెప్తున్నాయి.
తిప్పర్తి మండలంలోని శిలార్మియాగూడెంకు చెందిన ఎర్రమాద శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయంలో సుమారు 30 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. వర్షాధారిత మెట్ట పంటలు, వరితోపాటు బత్తాయి వంటి పండ్ల తోటలు సైతం సాగు చేశారు. శిలార్మియాగూడెం గ్రామంలో ఉన్న తన భూమిలో గతంలో బత్తాయి సాగు చేసినా.. సరిపడా నీళ్లు లేక కొన్నిసార్లు, దిగుబడి వచ్చినా సరైన ధర పలుకకపోవడంతో మరికొన్నిసార్లు ఎప్పుడూ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. మూడెకరాల ఎకరాల భూమిలో తాను పెంచి పెద్ద చేసిన బత్తాయి తోటతో ప్రయోజనం పెద్దగా కనిపించకపోవడంతో నిరాశ చెంది ఆ తోటను తొలిగించారు. అంతకుముందే తిరిగి ఏ పంట వేయాలనే దానిపై ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు చేశారు. అయిదేండ్ల కిందట ఛత్తీస్గఢ్లో సాగవుతున్న థాయ్ జామ గురించి తెలుసుకొని వెళ్లారు. ఉద్యానశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని తన మూడెకరాల భూమిలో మొత్తం 700 థాయ్ జామ మొక్కలు నాటారు. 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు దూరంతో జామ తోట వేశారు. ఒక్కో మొక్కకు రూ. 80 చొప్పున ధర చెల్లించి.. రాయ్పూర్ నుంచి రవాణా ఖర్చులు భరించి తెచ్చుకున్నారు. పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యానశాఖ ద్వారా రైతుకు ప్రోత్సాహం అందించింది. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేయడంతోపాటు.. తొలి ఏడాది హెక్టారుకు రూ. 17000, రెండో ఏడాది , మూడో ఏడాది హెక్టారు కు రూ. 5200 నిర్వహణ కోసం చెల్లించింది.
అంతకుముందే నీటి సమస్యతో బత్తాయి తోటను తొలిగించిన శ్రీనివాస్ రెడ్డికి థాయ్ జామ సాగుకు తక్కువ నీరే సరిపోయింది. డ్రిప్ పద్ధతి ద్వారా ఉన్న కాసిన్ని నీటినీ పొదుపుగా వాడుతూ.. తోట సాగు చేపట్టారు. తొలి ఏడాదే కొంత దిగుబడి వచ్చినా, రెండో ఏడాది పంటను మాత్రమే దిగుబడిగా తీశారు. క్రమం తప్పకుండా నిత్య పర్యవేక్షణతో వీలైనంత వరకు సేంద్రియ పద్ధతుల్లోనే సస్యరక్షణ చేపడుతున్నారు. మచ్చ సోకి కాయలు కుళ్లిపోకుండా పాలిథిన్ కవర్, న్యూస్ పేపర్లతో బ్యాగింగ్ చేస్తున్నారు. ఏటా రెండుసార్లు దిగుబడి వస్తుననది. నవంబర్-డిసెంబర్ మధ్య ఒకసారి.. ఏప్రిల్-మే నెలల్లో మరోసారి పంట దిగుబడి లభిస్తుంది. ఒక్కో చెట్టుకు 100 వరకు కాయలు కాస్తున్నా.. అధిక భారం పడకుండా సగటున 70 కాయలను మాత్రమే పెద్ద చేస్తున్నారు. ఒక్కో సీజన్లో ఎకరాకు కనిష్ఠంగా 6 టన్నుల నుంచి గరిష్ఠంగా 10 టన్నుల వరకు దిగుబడి లభిస్తుండగా.. మార్కెట్లో కేజీ ధర రూ. 50 నుంచి రూ. 80 వరకు ఆయా సందర్భాలను బట్టి రైతుకు గిట్టుబాటు అవుతున్నది.
ఇప్పటికే అయిదేండ్లుగా థాయ్ జామ తోటను సాగు చేస్తున్న ఎర్రమాద శ్రీనివాస్ రెడ్డి.. ఏటా సస్యరక్షణ పరంగా జాగ్రత్తలు తీసు కుంటున్నారు. జామ కాయ ఎదుగుతున్న క్రమంలో మచ్చ సోకే అవకాశం ఉండగా.. అది క్రమంగా పెద్దదై.. కాయను మొత్తం తొలిచే ప్రమాదమూ ఉన్నది. కొంత ఖర్చయినా.. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ.. ఒక్కో మొక్క పైన పెంచడానికి ఎంపిక చేసిన కాయలకు బ్యాగింగ్ చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నిలువరిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. 150 నుంచి 200 గ్రాములు ఉన్న కాయలను ఎంపిక చేసి.. ముందుగా వాటిని పాలిథిన్ కవర్తో చుట్టి.. సూర్యరశ్మి సోకకుండా పాలిథిన్ కవర్ పైన న్యూస్ పేపర్ ఉంచి పిన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల బరువు పెరిగే కాయకు.. మచ్చతోపాటు ఇతర తెగుళ్లను సైతం నివారించడం సాధ్యమవుతున్నది. ఒక్కో కాయ బరువు 500 గ్రాముల నుంచి గరిష్ఠంగా 750 గ్రాముల వరకు ఉంటున్నది. ప్రస్తుతం ఈ పంట సాగు తక్కువగా ఉండటంతోపాటు.. జామలో మంచి ఆరోగ్య లక్షణాలు ఇమిడి ఉన్నాయి. దీంతో సమీపంగా ఉన్న మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాల్లోని పలువురు వ్యాపారులు తోట దగ్గరికే వచ్చి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూపర్ మార్కెట్ల వ్యాపారులు కావాలని అడుగుతున్నా రైతు అందించలేకపోతున్నారు.
నేను ఐదేండ్ల కిందట థాయ్ జామ మొక్కలు నాటిన. నన్ను జూశి ఇప్పుడు శానా మంది రైతులు ఈ పంట సాగు చేస్తున్నరు. ఎకరానికి ఏడెనిమిది టన్నుల కాయ ఏడాదికి రొండుసార్లు కోస్తున్న. అంతకు ముందు బత్తాయి తోటకు నీళ్లు సరిపోక.. శానా ఆలోశించి, రాయపూర్ పోయి సూశి ఇది పెట్టాలని అన్కున్న. మా తోటల పండిన పండ్లు మొత్తం తోటకాడికే వచ్చి బేరగాళ్లు తీస్కపోతున్నరు. ఐద్రాబాద్ నుంచి శానా మంది కాయలు కావాలని ఫోన్లు జేస్తున్నరు. మాకాడ సరిపోట్లేవు. ఎక్కువమంది ఈ జామ తోటలు పెడ్తే.. ఎక్కువ దిగుబడి వస్తది. అప్పుడు చెన్నై, బెంగుళూర్, ఐద్రాబాద్ మార్కెట్లకు సైప్లె చెయ్యొచ్చు. అట్లజేస్తే ఎక్కువ ధర గూడ వచ్చి మంచి లాభాలు వస్తయి. బ్యాగింగ్ చేయడానికి ఒక్కో కాయకు 5 రూపాయలు ఖర్చవుతున్నది. అయినా అలా చేయడం వల్లనే మంచి ఆదాయం వస్తుంది.
– ఎర్రమాద శ్రీనివాస్ రెడ్డి, 9949787988 రైతు, నల్లగొండ జిల్లా
థాయ్ జామ సాగు ఇటీవల పెరుగుతున్నది. నల్లగొండ డివిజన్లోనే 200 ఎకరాలకు పైగా ఈ తోటలు వేశారు. వీఎన్ఆర్ బీహి అనే వంగడంలో తెలు పు, పింక్ రకాల మొక్కలు లభిస్తున్నా యి. ఈ తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ పై 90 శాతం సబ్సిడీ.. నిర్వహణ కింద తొలి ఏడాది హెక్టారుకు రూ. 17000, ఆ తర్వాత మరో రెండేళ్లు రూ. 5200 చొప్పున చెల్లిస్తున్నది. ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా కలిగిన ఈ ఫలం మధుమేహం రోగులు సైతం తీసుకోవచ్చు. కాయలను సంరక్షించుకోవడానికి బ్యాగింగ్ చేసుకోవడంతోపాటు.. ప్రూట్ ఫ్లై(పండు ఈగ), మచ్చ తెగులు(ఆంత్రక్నోస్) సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ఏటా రెండుసార్లు ప్రూనింగ్(కొమ్మల కత్తిరింపు) చేయాలి. ప్రారంభంలోనే నిమటోడ్ లేని మొక్కలు ఎంచుకోవాలి. ఒకవేళ నిమటోడ్ సోకితే ఒక మిల్లీలీటర్ వేలమ్ ప్రైడ్ను లీటర్ నీటిలో.. 3 గ్రాముల నిమిడ్జ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేప పిట్టు మొక్కలకు ఎరువుగా వేసుకుంటే మంచిది. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితేనే దిగుబడి పెరిగి, రైతుకు అధిక లాభం చేకూరుతుంది.
– పిన్నపురెడ్డి అనంత రెడ్డి, 8008126723 ఉద్యానశాఖ అధికారి, నల్లగొండ
– తోటల సాగుకు అనుకూలమైన నేలను గుర్తించాలి.
– నిమటోడ్ సోకని మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
– మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం పాటించాలి.
– సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి.
– ఏటా రెండుసార్లు ప్రూనింగ్ (కత్తిరింపు) చేపట్టాలి.
– బ్యాగింగ్ చేసి కాయలను సంరక్షించుకోవాలి.
– నిపుణుల సూచనలతో సస్యరక్షణ చేయాలి.
– డిమాండు ఉన్న చోట మార్కెట్ చేసి లాభాలు ఆర్జించాలి.