రాష్ట్రంలో ఆకుకూరలను విరివిగా సాగు చేసున్నారు. ఆకుకూరల్లో విటమిన్లు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దీనివల్ల ఆర్యోగానికి ఎంతో మంచివి. మన రాష్ట్రంలో పండించే ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, పుదీనా, బచ్చలకూర, మెంతికూర ముఖ్యమైనవి. అయితే ఈ ఆకుకూరలకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేసున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి తగిన నివారణ పద్ధతులు అవలంబించడం ద్వారా మంది దిగుబడి, లాభాలు పొందవచ్చు.
తెల్లతుప్పు తెగులు
ఈ తెగులు ఎక్కువగా తోటకూర, పాలకూరను ఆశిస్తుంది, ఈ తెగులు మొదట ఆకులపై తెల్లని పొక్కులు అక్కడక్కడ ఏర్పడుతాయి. ఇవి ఉబ్బెత్తుగా మెరుపుతో 1-2 మి.మి. పరిమాణం కలిగి ఉంటాయి తెగులు ఉధృతి పెరిగేకొద్దీ ఇటువంటి పొక్కులు మొదట ఏర్పడిన వాటి చుట్టూ ఎక్కువ సంఖ్యలో ఏర్ప డి ఎక్కువ ప్రాంతం ఆక్రమిస్తాయి. ఆకుల కణాలు చిట్లి తెల్లటి పొడి లాంటి శిలీంద్రబీజాలు తెగులు సోకిన ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ తెగులు చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
నివారణ: ఈ తెగులు ఆశించిన ఆకులను ఏరి నాశనం చేసి తగులబెట్టాలి. అవసరమైనప్పుడు మాత్రమే 1 శాతం బోర్డో మిశ్రమా న్ని చల్లాలి. 1 గ్రా మెటలాక్సిల్ 1 లీటరు నీటిలో కలిపి తెగులు సోకిన ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
బూజు తెగులు
ఆకుకూరల నాణ్యత, దిగుబడిని దెబ్బతీసే తెగుళ్ల లో బూజు తెగులు ముఖ్యమైనది. ఈ తెగులు చుక్కకూర, పాలకురను ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనిస్తే ప్రథమ బీజదళా లు మొదటిగా ఏర్పడిన ఆకుల పైభాగంలో లేత ఆకుపచ్చ లేదా పసుపురంగు కోణియ ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. ఇవి కింది ఆకుల నుంచి క్రమేపీ పైఆకులకు వ్యాపిస్తుంది. తెగులు తీవ్రత పెరి గేకొద్దీ లేత మచ్చలు ముదురురంగుకు మారి ఎండిపోతాయి. అలాంటి మచ్చల ఆకుల కింది భాగాలు గమనిస్తే వ్యాధి కారక శిలీంద్రం ఎదుగుదలను ఉదారంగులో గమనించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో తెగులు సోకిన ఆకులు ముడతలు పడి ఉంటాయి. ఆకు ఎండుతెగులు సోకిన ఆకుల వలే కనిపిస్తాయి. ఇది భూమిలో బీజా ల రూపంలో విత్తనాన్ని ఆశించి లేదా దీర్ఘకాలం జీవించి ఉండే పాలకూర జాతి మొక్కలపై జీవించి ఉంటుంది. తేమతో కూడిన చల్లని వాతావరణం తెగులు వ్యాప్తికి అనుకూలం.
యాజమాన్యం : ఆరోగ్యమైన విత్తనాల ఎంపిక పంట అవశేషాల నాశనం పంటల మార్పిడి చేసి అవసరమైనపుడు మాత్రమే రాగి ధాతు సంబంధమైన శిలీంద్ర నాశకాలను చల్లాలి. 3గ్రా మెటలాక్సిల్ కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేయాలి. లేదా 3గ్రా కాప్టాన్ లేదా థైరం 1కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేయాలి. 3గ్రా మెటాలాక్సిల్ 1 లీటరు నీటిలో కలిసి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేసి తెగులును అదుపులో ఉంచవచ్చు.
ప్యూజేరియం ఎండు తెగులు
ఈ తెగులు సోకిన మొక్కలు గిడసబారి ముదురు ఆకులు పసుపు రంగుకు మారుతాయి. మొక్క వడలిపోయి చనిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కాండం చీల్చి చూస్తే ముదురు గోధుమ రంగులో ఉంటుంది.
యాజమాన్యం: తెగులు తట్టుకునే వంగడాలు ఎంచుకోవాలి. పంట మార్పిడి చేయాలి. ప్యూజేరియం ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న నెలల్లో కొంతకాలంపాటు వేయకపోవడమే మంచిది. కార్బండిజవ్ు 2గ్రాములు కిలో విత్తనానికి కలిసి విత్తనశుద్ధి చేయాలి.
వేరు,కాండంకుళ్ళు
ఈ తెగులును ప్రధానంగా గోంగూరలో గమనించవచ్చు. ఈ తెగులు అన్నిదశల్లో ఆశిస్తుంది. లేత మొక్కల మొదలు భాగంలో నల్లటి పలుచని చారలు ఏర్పడుతాయి. అనుకూల వాతావరణ పరిస్థితులలో మచ్చలు పెరిగి పెద్దవై లేత మొక్కలు చనిపోతాయి. ఎదిగిన మొక్కలలో ఆకుల అంచుల చివర్లో మధ్య ఈనె మీద ఆకు తొడిమలపై మచ్చలు ఏర్పడి కలసిపోయి ఆకులు మాడిపోతాయి. ఈ తెగులు ఉధృతి పెరిగేకొద్దీ కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి పెరిగి పెద్దవై కాండం కుళ్ళు కలుగజేస్తాయి. కాండం మీద బెరడు చీలిపోతుంది. తెగులు వేరు కూడా వ్యాపించి మొక్క చనిపోతుంది
యాజమాన్యం : తెగులు కలిగించే శిలీంద్రం భూమిలో నివసిస్తుంది. ఈ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేయాలి.