రాష్ట్రంలో మిరప పంటను వానకాలం, యాసంగిలో కూడా సాగు చేస్తారు. అయితే యాసంగిలో మిరప పంటను కొన్ని పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారణకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు.
తామర పురుగులు:
రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చ టం ద్వారా ఆకుల అంచులు పైకి ముడుచుకొంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారుతాయి. దీంతో పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఫిప్రొనిల్ 400 మి.లీ. స్పైనోసాడ్ 75 మి.లీ. లేదా పెగాసెస్ 300 గ్రాములు ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. నాటిన 15వ రోజు, 45వ రోజు ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందించాలి. తద్వారా పైముడతను నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. రసాయన, సేంద్రియ ఎరువుల సమతుల్యత పాటించాలి. పైముడుతతో పాటు కిందిముడుత (తెల్లనల్లి) కూడాఉంటే కార్బరిల్, ఎసిఫేట్, స్పైనోసాడ్ మందులు వాడకూడదు.
కింది ముడుత (తెల్లనల్లి):
తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడుతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి. మొక్క ల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడుతాయి. దీని నివారణకు ఎకరానికి డైకోఫాల్ ఒక లీటరు లేదా నీళ్లతో కరిగే గంధకం 600 గ్రాములు పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు వాడకూడదు. నత్రజని ఎరువులను తగ్గించాలి. పైముడుత, కింది ముడుత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎరానికి జోలోన్ 400మి.లీ. లేదా పెగాసెస్ 300 గ్రాములు లేదా క్లోరిఫెనాఫైర్ 400 మి.లీ. పిచికారీ చేసుకోవాలి.