ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో కేవలం 90 సెకండ్లలోనే భూసార పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక సాధనాన్ని ఆవిష్కరించారు. ఈ పరికరం నేలలోని పోషకాల స్థాయిని అప్పటికప్పుడే విశ్లేషిస్తుంది. భూసారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్మార్ట్ ఫోన్కు చేరవేస్తుంది. ‘భూ పరీక్షక్’ యాప్ ఇన్స్టాల్ చేసుకొంటే, అన్ని వివరాలను అందులోనే అందిస్తుంది.
‘నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ’ సాంకేతికతను ఆధారం చేసుకొని, ఈ పరికరం పనిచేస్తుంది. నేలలోని పోషకాలను గుర్తించేందుకు 5 గ్రా. పొడిమట్టి నమూనాలను పరికరంలోని గొట్టంలో వేయాలి. వెంటనే పోషకాల విశ్లేషణను ప్రారంభిస్తుంది. నమూనా మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనంలాంటి పదార్థాలు ఏ మేరకు ఉన్నాయో చెప్పేస్తుంది. కేవలం 90 సెకన్లలోనే పని పూర్తి చేస్తుంది. భూసార పరీక్షల ఫలితం, నివేదిక రూపంలో ‘భూ పరీక్షక్’ యాప్లో చూపిస్తుంది. ఈ యాప్ రైతుల భాషల్లోనూ సమాచారం అందిస్తుంది. ఒక్క పరికరంతో దాదాపు లక్షకుపైగా నమూనాలను విశ్లేషించవచ్చని ఈ పరికరాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.