ఒక్క మార్పు.. ఎన్నో జీవితాలను మార్చేస్తుంది. అది సవ్యమైన దిశలో సాగితే.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. సిరులు కురిపిస్తూ.. ఎందరి జీవితాల్లోనో సంతోషాలను నింపుతుంది. చిన్న మందడి గ్రామంలోనూ అదే జరిగింది. కూరగాయల సాగుతో లక్షల్లో ఆదాయం సమకూరుతుండగా.. అక్కడి రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
ఒకప్పుడు చిన్న మందడి రైతులంతా వరి మాత్రమే సాగు చేసేవారు. ఆదాయం సరిపోక ఇబ్బందులు పడేవారు. ఏడాదంతా కష్టపడ్డా కుటుంబ పోషణకు కూడా తిప్పలు పడేవారు. ఎక్కువ భూమి ఉన్నవాళ్లు ఎలాగోలా బయటపడ్డా.. చిన్నకారు రైతులు మాత్రం ఆర్థికంగా చితికిపోయేవారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సలహాతో పంట మార్పిడి విధానాన్ని అవలంబించారు. కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం డిమాండ్.. సప్లయ్ సూత్రాన్ని పాటిస్తూ ఎకరం పొలంలోనే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదిస్తూ, ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.
100 ఎకరాల్లో సాగు..
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామ రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు. విభిన్నంగా ఆలోచిస్తూ, వైవిధ్యమైన పంటలు పండిస్తున్నారు. వీరి అభిరుచిని, పట్టుదలను చూసి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.. ఉద్యానశాఖ తరఫున సౌకర్యాలు, సబ్సిడీ మీద కూరగాయల నారు, స్ప్రింక్లర్లు, డ్రిప్తోపాటు మల్చింగ్ షీట్, సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. కూరగాయల సాగుచేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు కార్పస్ ఫండ్ కింద కలెక్టర్ రూ.5 లక్షలు అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో 15 ఎకరాల్లో ప్రారంభమైన కూరగాయల సాగు.. గతేడాది యాసంగిలో 100 ఎకరాలకు చేరుకున్నది. వంకాయ, టమాట, పచ్చిమిర్చి, బీరకాయ, కాకర, గోరుచిక్కుడు వంటి కూరగాయలను పండిస్తూ, సమీప పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు.
రాయితీలతో ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రాయితీలు ఇస్తూ.. రైతులను ప్రోత్సహిస్తున్నది. కూరగాయలు సాగుచేసే రైతులకు డ్రిప్ సిస్టమ్ అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ ఇస్తుండగా, సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం, ఐదెకరాలకుపైన ఉన్న రైతులకు 80 శాతం రాయితీతో డ్రిప్ సిస్టమ్ను సరఫరా చేస్తున్నది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యాన అభివృద్ధి మిషన్) పథకం కింద జీడిమెట్ల సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నుంచి 80 శాతం రాయితీపై కూరగాయల నారును అందిస్తున్నది.
ఒక ఎకరానికి టమాట, వంకాయ సాగు కోసం 8,000 మొక్కలు అవసరం ఉండగా, వీటికి రూ.8 వేల ఖర్చువుతున్నది. ఇందులో రైతులు రూ.1500 మాత్రమే చెల్లిస్తూ, రూ.6500 సబ్సిడీ పొందుతున్నారు. మిర్చి సాగు చేసే రైతులకు ఎకరానికి 6400 మొక్కలు అవసరం ఉండగా, రైతు వాటా కింద రూ.1680 చెల్లిస్తూ, రూ.6,720 రాయితీ పొందుతున్నారు. ఇక మల్చింగ్ పేపరుపై హెక్టారుకు అయ్యే పూర్తి ఖర్చు రూ.32 వేలు కాగా, ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తున్నది. వనపర్తి జిల్లాలోని మోజర్ల ఉద్యానవన కళాశాల ద్వారా గత యాసంగిలో లక్ష మొక్కలను, ఈ ఏడాది 50 వేల మొక్కలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చొరవ తీసుకుని ఉచితంగా పంపిణీ చేశారు.
ఎకరానికి రూ.2.80 లక్షలు..
మాకు ఎకరం భూమిలో వరి వేస్తే ఏం లాభం లేకపోయేది. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి మాటలు విని పంట మార్పిడి చేసినం. కూరగాయల సాగు మొదలుపెట్టినం. వంకాయ, పచ్చిమిర్చి, కాకర, బీర వేశాం. మంచి దిగుబడి వచ్చింది. నారు కూడా ఉచితంగా అందించారు. మేమిద్దరమే కష్టపడ్డం. ఆరు నెలల్లనే రూ.2.80 లక్షల ఆదాయం వచ్చింది. ఇంత లాభం మా జీవితంలో చూడలేదు. కష్టపడితే రోజూ పైసలే. ఇంత ఆదాయం వేరే పంటల్లో లేదు.
– చుక్క వెంకటయ్య, శేషమ్మ.
ప్రోత్సహిస్తున్నాం..
కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల ద్వారా కలిగే ప్రయోజనాలు, లాభాలను వివరిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను తెలియజేస్తున్నాం. వీటన్నిటినీ వినియోగించుకుని చిన్నమందడి రైతులు లాభపడుతున్నారు. జిల్లాలోనే అధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం.
-సురేశ్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, వనపర్తి
భారీ లాభాలు..
ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ, రెండెకరాల్లో కూరగాయలు సాగు చేశా. రూ.5.70 లక్షల ఆదాయం వచ్చింది. ప్రతిరోజూ ఖర్చులు, ఆదాయం లెక్కలు రాసుకున్నాను. ఇతర పంటలతో పోలిస్తే కూరగాయల్లోనే ఎక్కువ లాభం కనిపిస్తున్నది. నాకు 10 ఎకరాల భూమి ఉంది. అయినా, మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులోనూ కూరగాయలే పండిస్తా. కుటుంబ సభ్యులమే పనిచేసుకుంటాం. సంతలకు వెళ్లి అమ్ముకుంటాం. ఎక్కువ హోల్సేల్గానే విక్రయిస్తాం.
-ముడావత్ పుల్యానాయక్, రైతు
రాందేని చంద్రమౌళి
గుంటి వినోద్ కుమార్