సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నా. కానీ, పలు రకాల దోమలు, ఈగలు, మిడతలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రసాయన మందులు వాడకుండా, వీటిని నివారించే మార్గాలు ఏమిటి?
– నర్సింహారెడ్డి, నుస్తులాపూర్.
కూరగాయలు, పండ్ల తోటల్లో తెగుళ్ల కంటే ఎక్కువగా నల్ల దోమ, తెల్ల దోమతోపాటు కొన్ని రకాల మిడతలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తికి కూడా ప్రధాన వాహకాలుగా పనిచేస్తాయి. వీటి ఉధృతిని తగ్గించగలిగితే, పలు రకాల తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవచ్చు. వీటిని అరికట్టడంలో ‘లింగాకర్షక బుట్టలు’ సమర్థంగా పనిచేస్తాయి. ఇవి తోటలపై వాలే ఈగలు, దోమలు, మిడతలను ఆకర్షించి, వాటిని నిర్మూలించడంలో సాయపడతాయి. ప్రస్తుతం పసుపు రంగు, నీలి రంగు లింగాకర్షక బుట్టలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు.
పసుపు రంగు బుట్టలు : ఇవి తెల్ల దోమ, నల్ల దోమ, పచ్చ దోమ, వివిధ రకాల ఈగలను ఆకర్షిస్తాయి.
నీలి రంగు బుట్టలు : ఆకులను తినే మిడతలనూ ఆకర్షిస్తాయి.
తయారు చేసే విధానం :
ముందుగా పసుపు, నీలి రంగు అట్టలను తీసుకొని వాటికి నూనె లేదా ఆముదం లేదా వెస్లిన్ జెల్లీని పొరగా పూయాలి. వీటిని ఎకరానికి 10 చొప్పున తోటల్లో అక్కడక్కడా అమర్చుకోవాలి. ఎక్కువ ఎత్తులో కాకుండా ఆయా పంటలను బట్టి, మొక్కలకు ఒక గజం ఎత్తులో ఉండేలా కర్రల సాయంతో వీటిని ఏర్పాటుచేయాలి. ఫలితంగా తోటలను ఆశించే దోమలు, ఈగలు ఆయా రంగులకు ఆకర్షితులై, వాటిమీద వాలుతాయి. ఆ జిగురుకు అంటుకొని చనిపోతాయి. ఇలా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే దోమలను, ఈగలను అరికట్టవచ్చు.