కూరగాయ పంటతో అధిక లాభాలు
చీడపీడలు తట్టుకునేలా సరికొత్త వంగడాలు
‘వంగ’ సాగుతో.. అన్నదాత ‘బెంగ’ తీరుతున్నది. కూరగాయల్లో రారాజుగా వెలుగొందే వంకాయ.. తనను పండించే రైతును కూడా రాజుగా మారుస్తున్నది. దీర్ఘకాలిక/ స్వల్పకాలిక పంటగా సాగవుతూ.. అన్నదాతకు అధిక ఆదాయాన్ని అందిస్తున్నది. చీడపీడలు తట్టుకునేలా సరికొత్త వంగడాలు మార్కెట్లోకి వస్తుండగా, రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతున్నది.
వంగసాగును రైతులు దీర్ఘకాలిక పంటగా, స్వల్పకాలిక పంటగానూ సాగు చేయవచ్చు. దీర్ఘకాలిక పంట 7-8 నెలల వరకు ఉంటుంది. తెగుళ్లు, చీడపీడలు ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘకాలిక పంటకు వెళ్లడం మంచిది. లేకపోతే వ్యయం పెరిగి లాభాలు తగ్గే ప్రమాదం ఉన్నది. వంకాయల్లో తెల్ల వంకాయలు, చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు ప్రధాన రకాలు.
అనుకూల నేలలు, వాతావరణం :
చలికాలంలో వంగసాగును చేపట్టాలనుకొనే రైతులు.. నవంబర్ నుంచి డిసెంబర్లో నారు పోసుకోవాలి. వేసవిలో సాగుకోసం ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారంలో నాటుకుంటే మంచిది. సారవంతమైన నేలలు, నీరు బాగా ఇంకే నేలలు వంగ సాగుకు అనుకూలం. అయితే, చౌడు నేలల్లో వంకాయలను సాగు చేయకపోవడమే మంచిది. నేలలో పోషకాల శాతం ఎక్కువగా ఉంటేనే ఏ పంట అయినా అధిక దిగుబడులను అందిస్తుంది. కాబట్టి, పంట వేయడానికి ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి. భూమిని 2-3 సార్లు ట్రాక్టర్ కల్టివేటర్తో దున్నుకోవాలి.
ఇలా చేయడం వల్ల నేల వదులుగా తయారవుతుంది. కలుపు మొక్కల విత్తనం కూడా నాశనం అవుతుంది. నేలను వదులుగా దున్నడం వల్ల వేర్లు సులువుగా నేలలోకి చొచ్చుకొని వెళ్లి మొక్క బలంగా తయారవుతుంది. చివరి దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం వేసుకొని.. నేల మొత్తాన్ని కలియ దున్నుకోవాలి. ఎండు తెగులు నివారణకు మొదట్లోనే ఎకరం పొలానికి 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. మొక్కల పెరుగుదలకు 13 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య సగటు ఉష్ణోగ్రతలు అవసరం. వంకాయ విత్తనాలు 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద బాగా మొలకెత్తుతాయి.
వంగలో రకాలు :
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల వంకాయలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రధానంగా భాగ్యమతి, శ్యామల, పూస పర్పుల్ క్లస్టర్, పూస పర్పుల్ లాంగ్, పూస క్రాంతి వంటివి మన ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి.
భాగ్యమతి : ఈ రకం పంట కాలం 150-165 రోజులు. ఎకరానికి 12-14 టన్నుల దిగుబడి వస్తుంది.
శ్యామల : ఈ రకం పంట 130-150 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి దిగుబడి 7-9 టన్నుల వరకూ ఇస్తుంది.
పూస పర్పుల్ క్లస్టర్ : దీని పంట కాలం 135-145 రోజులు. ఎకరానికి 13-16 టన్నుల దిగుబడి పొందవచ్చు.
పూస పర్పుల్ లాంగ్ : ఈ రకం పంట 135-145 రోజుల్లో కాతకు వస్తుంది. ఎకరానికి 13-16 టన్నుల వరకూ దిగుబడి ఉంటుంది.
పూస క్రాంతి : ఈ రకం పంట కాలం 135-150 రోజులు. ఎకరానికి దిగుబడి 14-16 టన్నుల వరకూ ఉంటుంది.
వంగలో ఉపజాతులు :
ముండ్ల వంగ : ఈ రకానికి నీరు పెట్టకుండానే వర్షాధారంగా సాగు చేయవచ్చు. తక్కువ తేమతో మొక్కలు పెరుగుతాయి. ఈ రకంలో ఆకుల దగ్గర, కాయ తొడిమల దగ్గర, పుష్పకోశాలపైనా ముండ్లు ఉంటాయి. కాయ గుండ్రంగా ఉంటుంది. నారు పెద్దగా ఎదిగి ఒక్కోసారి కిలో వరకూ తూగే కాయలు కాస్తాయి. కొన్ని కాయలపై చారలు కానీ, మచ్చలు కానీ ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే.. ముండ్ల వంగ రుచిగా ఉంటుంది., అందుకే, ఈ రకం చాలా ప్రసిద్ధి పొందింది.
ఆత్రేయపురం వంగ : ఆత్రేయపురం వంగ పొడవుగా, సన్నగా ఉండే కాయలను కాస్తుంది. ఇది కూడా మెట్ట ప్రాంతంలో పండించే రకం. దీనికి ముండ్లు ఉండవు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. అందుకే, దీనికి ఈ పేరు. పచ్చి కాయలు ఆకుపచ్చగా, చారలు కలిగి ఉంటాయి. ఇది వర్షాకాలం తర్వాత సాగు చేసే రకం.
నీటి వంగ : ఈ రకం చలికాలంలో సాగుకు అనుకూలం. ఇది ముండ్లు లేని రకం. ఈ కాయలు సుమారు అంగుళం లావు, 25 సెం.మీ. నుంచి 30 సెం.మీ. వరకు పొడవు పెరుగుతాయి. కాయలు ఉదారంగులో, రుచికరంగా ఉంటాయి.
గుత్తివంకాయ : ఈ రకం వంకాయలు చిన్నగా ఉండి, గుత్తులుగా కాస్తాయి. రెండుమూడు కాయలు ఒక గెలగా ఉంటాయి. అయితే, దిగుబడి తక్కువగా ఉండటం వల్ల దీన్ని పెద్దగా సాగు చేయడం లేదు. అయితే, మార్కెట్లో దీనికి డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది.
పోచవారి రకం : పోచవారి రకం గుండ్రటి కాయలు కలిగి ఉంటాయి. దొడ్లలోనూ, పెరట్లోనూ పెంచుకోవడానికి బాగుంటాయి. ఈ రకాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నవారు.. ఈ రకాన్ని సాగు చేసుకుంటే మంచిది.
నారు నాటే విధానం :
వంగనారులో పొడవుగా, నిటారుగా పెరిగే (పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల) రకాలను 60/60 సెం.మీ, గుబురుగా పెరిగే (పూసా క్రాంతి, ఆక్ర కుసుమాకర్, గులాబీ) రకాలను 75/50 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరానికి 200 కిలోల వేప పిండి, 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. నారు నాటేముందు ఎకరానికి 10 కిలోల చొప్పున కార్పొఫ్యూరాన్ గుళికలను వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. డ్రిప్ పద్ధతిలో సాగు చేయాలనుకునే రైతులు మొక్కలు నాటుకునే సాళ్లను కొంచెం ఎత్తు వరకూ చేసుకొని, మల్చింగ్ కవర్ వేసుకోవాలి. దీనివల్ల కలుపు నివారణ, సాగునీరు వృథా కాకుండా అడ్డుకోవచ్చు. పోషక ఎరువులను డ్రిప్ ద్వారా అందించవచ్చు.
నీటి సరఫరా :
వంగ మొక్కలు నాటే ముందు, నాటిన తర్వాత నారుకు నీరు పెట్టాలి. భూమిలో తేమశాతాన్ని బట్టి చలికాలంలో 7 నుంచి 10 రోజులకు ఒకసారి, వేసవిలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి, వర్షకాలంలో అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు వరకూ నీటి తడులు పెట్టాలి. లేకుంటే వంకాయలు చేదుగా తయారవుతాయి.
చీడపీడలు :
ఎన్ని రకాల సరికొత్త వంగడాలను సృష్టిస్తున్నప్పటికీ.. వంగతోటలకు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు వంటి చీడపీడలు సోకుతాయి. సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతో చీడపీడలను నివారించుకోవచ్చు.
కాయతొలుచు పురుగు : ఈ పురుగు వల్ల 11 నుంచి 93 శాతం పంటకు నష్టం కలుగుతుంది. నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ ప్రొఫేనోఫాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
అక్షింతల పురుగు : ఈ పురుగు వ్యాపించినప్పుడు చేనులో ఉల్లి పాషాణం గానీ, ఖటిక పాషణం గానీ చల్లుకోవాలి. పురుగు నివారణకు మలాథియాన్ (0.16 శాతం) మందును పిచికారీ చేయాలి.
ఎండుతెగులు నివారణ : ఎర పంటగా 4-6 సాళ్ల మధ్య బంతి మొక్కలు నాటుకోవాలి. క్యాబేజీతో పంట మార్పిడి చేసుకున్నా.. ఎండు తెగులును నివారించవచ్చు.
సాగు విధానం :
విత్తనాలను 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరమ్ లేదా మాంకోజెబ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. 260 గ్రా. విత్తనాన్ని 10 సెం.మీ వరుసలో విత్తుకోవాలి. నారుకుళ్లు నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ను కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు నారుమడిని బాగా తడుపుతూ ఉండాలి. మొక్కల ఎదుగుదలకు ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను దుక్కిలో వాడాలి. ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 రోజులపాటు నీడలో ఉంచి.. అప్పుడప్పుడూ నీరు చల్లుతూ ఉంటే శిలీంధ్రం బాగా అభివృద్ధి చెందుతుంది. దీనిని దుక్కిలో వేసుకుంటే.. ఎండు, వేరుకుళ్లు తెగుళ్లను నివారించవచ్చు.
సస్యరక్షణ
పంట పెరిగే దశలో.. మొక్కకు రెండు చొప్పున అల్లిక రెక్కల పురుగులను విడిచిపెట్టాలి.
ఎకరానికి నాలుగు చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి.
తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందికి తీసివేయాలి.
…? మజ్జిగపు
శ్రీనివాస్రెడ్డి