రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లికి చెందిన ‘సయ్యద్’ సోదరులు.. ‘పట్టు’ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పక్కా ప్రణాళిక, అద్భుతమైన కార్యాచరణతో, అధికారుల సూచనలను పాటిస్తూ.. పట్టు పురుగుల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆశించిన దానికంటే మూడు రెట్లు అధికంగా లాభాలు గడిస్తున్నారు.
సయ్యద్ సాదిఖ్, సయ్యద్ రఫీఖ్ అన్నదమ్ములు. సాదిఖ్ బీకామ్, రఫీఖ్ కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా చేశారు. ఇద్దరూ కొన్నేండ్లపాటు ప్రైవేటు కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు చేశారు. అయితే, ఉద్యోగాలతో విరక్తి చెందిన ఈ అన్నదమ్ములు.. వ్యవసాయంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ సాగు ఏమాత్రం ఆశాజనకంగా లేదని గుర్తించి, ‘పట్టు పురుగుల’ సాగువైపు అడుగులేశారు.
‘సెరికల్చర్’పై అవగాహన పెంచుకునేందుకు సయ్యద్ సోదరులు వివిధ రాష్ర్టాల్లోని పట్టు శిక్షణ కేంద్రాలకు వెళ్లారు. జిల్లా సెరికల్చర్ అధికారులను కలిసి, పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుకొని ‘సెరికల్చర్’ ప్రారంభించారు. తమ వ్యవసాయ క్షేత్రంలోనే 60 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పుతో 300 గుడ్ల కెపాసిటీ గల షెడ్ను నిర్మించారు. రెండు ఎకరాలలో మల్బరీ మొక్కలను నాటారు.
పక్కా ప్రణాళికతో సాగితే 22 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని సయ్యద్ సోదరులు చెబుతున్నారు. వీరు ఒక నెలలో 200 కిలోల కకూన్స్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటిద్వారా లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. పట్టు పురుగుల పెంపకం, మార్కెటింగ్, కూలీల ఖర్చు మొత్తం రూ.30 వేలు దాటడం లేదు. ఈ లెక్కన నెలకు రూ.80 వేల నుంచి 90 వేల వరకూ నికర ఆదాయం పొందుతున్నారు.
అవార్డుల పంట : పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు పొందుతూ, అవార్డుల పంటా పండిస్తున్నారు. అధికారుల మన్ననలు పొందుతున్నారు. జిల్లా అధికారుల నుంచి రంగారెడ్డి జిల్లా ‘బెస్ట్ సెరికల్చర్ ఫార్మర్స్-2021’ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ రంగంలో రాణించాలనుకునే రైతులు.. సయ్యద్ సోదరుల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తూ, వీరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
పట్టు పురుగులను చిన్న పిల్లల్లా పెంచాలి. అప్పుడే వంద శాతం లాభం దక్కుతుంది. మేము ఇప్పటికే 22 పంటలు తీశాం. ప్రస్తుతం 23వ పంట కొనసాగుతున్నది. అధికారులు, నిపుణుల సలహాలు పాటిస్తూ, ముందుకెళ్తున్నాం. మల్బరీ – వీ1 మొక్కల ఆకులను పురుగులు ఎంతో ఇష్టంగా తింటాయి. వీ1లో పోషక విలువలు అధికం. ఈ మేత తిన్న పురుగులు 15, 16 రోజుల నుంచే స్పిన్నింగ్ (దారం) చేయడం ప్రారంభిస్తాయి. వాటికవే తమ చుట్టూ కండెలను తయారు చేసుకుంటాయి. అలా తయారైన వాటిని సికింద్రాబాద్లోని తిరుమలగిరి మార్కెట్కు తరలిస్తాం. కొంచెం శ్రద్ధతో, ఇష్టంగా మల్బరీ సాగును కొనసాగిస్తే.. ఎవరికైనా లాభాలు వస్తాయి.
సయ్యద్ సాదిఖ్, సయ్యద్ రఫీఖ్
ఆర్. వెంకన్న